విశ్వాస్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : తెలంగాణ రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. బీఆర్ఎస్ వర్సస్ బీజేపీ పోరు వెనుకబడిన కాంగ్రెస్ కొత్త వ్యూహాలు సిద్దం చేస్తోంది. తెలంగాణలో బలమైన పార్టీగా ఉన్న కాంగ్రెస్ పూర్వ వైభవం కోసం ఏఐసీసీ ముఖ్య నేతలు ఫోకస్ చేస్తున్నారు. రాష్ట్ర నేతలు కొత్త ప్రతిపాదనలు సిద్దం చేస్తున్నారు. కొత్త ఇంఛార్జ్ థాక్రే పార్టీ నేతలకు హైమాండ్ సందేశం స్పష్టం చేసారు. పార్టీ నేతలు ప్రజలతో మమేకం అయ్యేందకు పాద యాత్రలకు సిద్దమయ్యారు. ఇదే సమయంలో గాంధీ కుటుంబానికి ఒక కీలక ప్రతిపాదన పంపారు. ఇప్పుడు అదే తెలంగాణ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చకు కారణమవుతోంది........ గాంధీ కుటుంబానికి తాజా ప్రతిపాదన తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ కు ఇప్పటికీ ప్రజల్లో ఆదరణ ఉందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. రాష్ట్ర నేతల మధ్య అనైక్యత ప్రత్యర్ధి పార్టీల ఎదుగుదలకు అవకాశంగా మారుతోందని ఇంఛార్జ్ లు సైతం ఏకీభవిస్తున్నారు. ఇదే సమయంలో స్వయంగా ప్రియాంక గాంధీ తెలంగాణ వ్యవహారాల పైన ఫోకస్ పెట్టారు. ఇంఛార్జ్ ల నుంచి పూర్తి సమాచారం సేకరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోని లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయాలని ప్రియాంకను కోరుతూ రాష్ట్ర నేతలు ప్రతిపాదన పంపినట్లు తెలుస్తోంది. ఇందుకోసం రెండు లోక్ సభ స్థానాలను సూచించారు. మెదక్ లేదా మహబూబ్ నగర్ నుంచి పోటీ అంశం పరిశీలించాలని కోరారు. దీంతో లోక్ సభ కంటే ముందుగానే జరిగే అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఈ అంశం సానుకూల ఫలితాలు ఇస్తుందని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు.
మెదక్ నుంచి నాడు ఇందిరా గెలుపు 1980 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా నాడు ఇందిరాగాంధీ పోటీ చేసి విజయం సాధించారు. నాడు ఇందిరకు 301577 ఓట్లు వచ్చాయి. ఇందిర నాటి ఉమ్మడి రాష్ట్రంలో పోటీ చేయటంతో మొత్తం 42 లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ 41 స్థానాల్లో విజయం సాధించింది. ఇప్పుడు బీఆర్ఎస్ - బీజేపీకి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ ఉందని.. తెలంగాణ నుంచి ప్రియాంక పోటీ చేస్తే ముందుగా జరిగే అసెంబ్లీతో పాటుగా.. తెలంగాణలోని 17 లోక్ సభ స్థానాల పైనా ప్రభావం ఉంటుందని వివరించేందుకు టీపీసీసీ నేతలు ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ పైన గాంధీ కుటుంబం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినా.. ప్రియాంక తెలంగాణ నుంచి ఎన్నికల బరిలో దిగేందుకు ముందుకు వస్తారా లేదా అనేది ఆసక్తి కరంగా మారుతోంది.
బీజేపీ - బీఆర్ఎస్ తో పోటీ పడేలా.. తెలంగాణలో గులాబీ - కాషాయం పార్టీలు హోరా హోరీగా తల పడుతున్నాయి. కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటలే అసలు సమస్యగా మారుతున్నాయి. కొత్త ఇంఛార్జ్ చికిత్స మొదలు పెట్టారు. కానీ, సీఎం కేసీఆర్ తెలంగాణ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం నమోదు చేసుకొనేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అటు బీజేపీ కోసం స్వయంగా ప్రధాని మోదీ రంగంలోకి దిగుతున్నారు. ఈ సమయంలో కాంగ్రెస్ కు కూడా గాంధీ కుటుంబం నుంచి మద్దతు కావాలని రాష్ట్ర నేతలు కోరుతున్నారు. ఆ ఇద్దరికి పోటీ ఇచ్చేలా ప్రియాంక రాష్ట్రంలో మొహరిస్తే..పార్టీలో అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని అంచనా వేస్తున్నారు. తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో రాష్ట్ర నేతలు అభ్యర్ధనలను ప్రియాంక ఎంత వరకు ఆమోదిస్తారనేది చూడాలి.
Admin
Viswas Tv