విశ్వాస్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : అక్రమార్జనని సమర్థించడాన్ని మించిన దేశ ద్రోహం ఉందా? మనదేశం ఎన్నో స్కాములు చూసింది..అయినా మన ఆర్ధిక వ్యవస్థ తట్టుకుని నిలబడింది.. కానీ, 'ఎవరు అవినీతి చేయలేదు' అంటూ ఆ స్కాములను సమర్థించడానికి తమ మేధస్సును ఉపయోగించే మేధావులు, బాబాలు,జర్నలిస్టుల వల్లే తీరని నష్టం జరుగుతోంది. (ఇదే మేధావులు అన్నాహజారే వెనకాల చేరి అవినీతి వ్యతిరేక ఉద్యమాలు చేసారు.) ఎదిగిన వాళ్ళంతా అడ్డదారుల్లో ఎదిగిన వారే అనే అభిప్రాయం ప్రజల్లో బలపడడం వల్ల,'ఏదో రకంగా డబ్బు సంపాదించడమే' జీవిత లక్ష్యం అయిపోతుంది. ఈజీ మనీ కోసం వెంపర్లాట పెరుగుతుంది. బలిసినవాళ్ళు వేలకోట్లు దోచుకుంటుంటే, మనం ఈ చిన్న దోపిడీ/మోసం చేయడం తప్పే కాదు అనే సమర్థన మొదలవుతుంది. లంచాలు తీసుకోవడం తప్పే కాదు అని ఉద్యోగులు భావిస్తుంటారు. కేజీఎఫ్, పుష్ప లాంటి సినిమాలు సూపర్ హిట్ అవడం..యువత ఆలోచనల్లో వచ్చిన మార్పుకి నిదర్శనం. ప్రజల్లో కష్టపడి ఎదగాలనే తపన, ఆలోచన తగ్గిపోతే, పరిశ్రమలు, వ్యాపారాలకు నమ్మకమైన నాణ్యమైన మానవవనరులు దొరక్క యంత్రాలపై ఆధారపడడం ఎక్కువ అవుతుంది. దీనితో నిరుద్యోగం పెరుగుతుంది.. నిరుద్యోగులని ఆదుకునే పేరుతో ప్రభుత్వాలు ఉచితాలు ప్రకటిస్తాయి. ఈ ఉచితాల భారం నిజాయితీగా పన్ను చెల్లించే ఉద్యోగులు, వ్యాపారాలపై పడుతుంది. దానితో వ్యాపారులు విదేశీ కంపెనీలతో పోటీ పడే శక్తి కోల్పోతారు. ఇది మరింత నిరుద్యోగాన్ని పెంచుతుంది. ఇది ఒక విషవలయంలా కొనసాగుతూనే ఉంటుంది. అమెరికాలో కార్పోరేట్ మోసాలు లేవా, అమెరికా ఎదగలేదా..అని ప్రశ్నించేవాళ్ళు గుర్తించాల్సింది ఏమిటంటే..అమెరికాలో ఒక మోసం బయటపడితే ఎంత పెద్ద పలుకుబడి ఉన్నవారికైనా శిక్ష తప్పదు అనే భయం ఉంటుంది. అంటే, అమెరికాలో 'రూల్ ఆఫ్ లా' మన కన్నా ఎన్నో రెట్లు మెరుగు. (అక్కడ కూడా కొందరు తప్పించుకోవచ్చు). సో, అవినీతిపరుడి కన్నా, ఆ అవినీతిని సమర్థించేవారు దేశానికి ఎక్కువ ద్రోహం చేస్తున్నట్లు. మతం కోసమో, కులం కోసమో, పార్టీ కోసమో, అవినీతిని సమర్థించేవారిని మించిన దేశద్రోహులు ఎవరూ ఉండరు. నరిష్ శిరోమణి.
Admin
Viswas Tv