విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / కడప జిల్లా : ఏపీలో బీసీ కార్పోరేషన్ డైరెక్టర్ పదవిలో ఉంటూ కర్నాటకలో నకిలీ నోట్ల చెలామణీ వ్యవహారంలో అరెస్ట్ అయిన వైసీపీ మహిళా నేత రసపుత్ర రజనీని ఆ పదవి నుంచి తప్పిస్తూ ప్రభుత్వం ఇవాళ జీవో జారీ చేసింది.ఏపీ బొందిలి కార్పోరేషన్ డైరెక్టర్ రసపుత్ర రజిని తాజాగా నకిలీ నోట్ల చలామణి కేసులో దొరికిపోయారు. కర్నాటకలో నకిలీ నోట్లు చెలామణి చేస్తున్న ఆమెతో పాటు చరణ్సింగ్ అనే మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వీరిని అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి పోలీసులు రూ.44 లక్షల విలువగల రూ.500 ఫేక్ కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఈ వ్యవహారం ఏపీ ప్రభుత్వంలో కలకలం రేపింది.
కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన రసపుత్ర రజనీ వైసీపీలో యాక్టివ్ గా ఉండే మహిళా నేతగా పేరు తెచ్చుకున్నారు. దీంతో ఆమెను ఈ బీసీ కార్పోరేషన్ (బొందిలి) డైరెక్టర్ పదవికి ప్రభుత్వం గతంలో నియమించింది. అయితే తాజాగా కర్నాటక పోలీసులు ఆమెను నకిలీ నోట్ల కేసులో అరెస్టు చేయడంతో ప్రభుత్వం ఇరుకునపడింది. ఈ వ్యవహారంలో ఆమె తప్పున్నట్లు తేలితే చర్యలు తీసుకుంటామని వైసీపీ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాదరెడ్డి ప్రకటించారు. దీంతో ఆమెపై చర్యలు తప్పవని తేలిపోయింది. ఇవాళ రజనీని తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
బీసీ సంక్షేమ శాఖ రెండు రోజుల క్రితమే బొందిలి కార్పోరేషన్ డైరెక్టర్ పదవి నుంచి రసపుత్ర రజనీని తప్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ ఉత్తర్వులు ఇవాళ వెలుగుచూశాయి. ఇందులో కర్నాటకలోని బెంగళూరు నగరంలో ఉన్న సుబ్రమణ్యపుర పోలీసు స్టేషన్లో నకిలీ నోట్ల కేసు ఆమెపై నమోదు కావడంతో ఆమెను తప్పిస్తున్నట్లు ప్రభుత్వం ఈ ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రస్తుతం ఏపీ బొందిలి కార్పోరేషన్ లో నాన్ అఫిషియల్ డైరెక్టర్ గా ఉన్న రజనీ నియామకాన్ని నిలుపుదల చేయడంతో పాటు ఆమెను పదవి నుంచి తప్పిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.
Admin
Viswas Tv