విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / విశాకపట్నం జిల్లా : ముఖ్యమంత్రి జగన్ విశాఖకు షిఫ్ట్ అయ్యేందుకు కసరత్తు మొదలైంది. విశాఖ కేంద్రంగా సీఎం తన పాలనా వ్యవహారాలు పర్యవేక్షించేందుకు సిద్దమవుతున్నారు. మూడు రాజధానుల వివాదం కోర్టులో స్పష్టత వచ్చిన తరువాత రాజధానుల అంశం పైన ప్రభుత్వం తదుపరి కార్యాచరణ ఖరారు చేయనుంది. సుప్రీం కోర్టులో ఈ నెల 23న మూడు రాజధానుల కేసు విచారణకు రానుంది. ఇదే సమయంలో ముఖ్యమంత్రి గా రాష్ట్రంలో ఎక్కడి నుంచి అయినా పాలన సాగించే అవకాశం ఉండటంతో.. విశాఖలో సీఎం క్యాంపు కార్యాలయం ఏర్పాటుకు కసరత్తు సాగుతోంది. ఇందుకోసం విశాఖలోని బీచ్ రోడ్డులో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం కోసం ఇంటిని ఖరారు చేసినట్లు సమాచారం. ఇందుకు గృహ ప్రవేశం ముహూర్తం కూడా ఖరారు అయినట్లు తెలుస్తోంది.
విశాఖలో సీఎం ఇంటి గృహ ప్రవేశం.. ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు చేపట్టిన తరువాత మూడు రాజధానుల ప్రకటన చేసారు. విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించారు. ఈ నిర్ణయం పైన అమరావతి రైతులు..జేఏసీ హైకోర్టును ఆశ్రయించగా .. హైకోర్టు అమరావతి రాజధానిగా కొనసాగాలని ఆదేశించింది. దీని పైన ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ కు వెళ్లింది. ప్రస్తుతం ఆ కేసు సుప్రీం కోర్టులో పెండింగ్ ఉంది. ఏపీ ప్రభుత్వ వినితితో ఈ నెల 23న సుప్రీంకోర్టులో మూడు రాజధానుల కేసు విచారణ చేపట్టనుంది. ఇదే సమయంలో ముఖ్యమంత్రి జగన్ సీఎంగా తాను రాష్ట్రంలో ఎక్కడి నుండి అయినా పాలన చేసే అవకాశం ఉండటంతో.. విశాఖలో క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేసుకొని..అక్కడ నుంచి పాలన చేయాలని భావిస్తున్నారు. ఇందు కోసం విశాఖలోని బీచ్ రోడ్డులో భవనం గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ నెల 23న కోర్టు తీర్పు మూడు రాజధానులకు అనుగుణంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. కోర్టు తీర్పుకు అనుగుణంగా ప్రభుత్వం కార్యాచరణ అధికారికంగా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.
ముహూర్తం ఖరారు.. ద్విముఖ వ్యూహం విశాఖలో సీఎం క్యాంపు కార్యాలయానికి ఉగాది నాడు మార్చి 22 గృహ ప్రవేశం ముహూర్తంగా ఖరారు చేసినట్లు సమాచారం. ముందుగా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ప్రారంభించి అక్కడి నుంచే సమీక్షలు పాలనా వ్యవహారాలు నిర్వహించనున్నారు. కోర్టులో తీర్పు అనుకూలంగా వస్తే రానున్న విద్యా సంవత్సరానికి ముందే సచివాలయం తరలింపుకు సంబంధించి ముందుగా భవనాలు గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. కోర్టు తీర్పుకు అనుగుణంగా సచివాలయం తరలింపు పైన నిర్ణయం తీసుకోనున్నారు. కోర్టు తుది తీర్పు ఆలస్యం అయితే, మార్చి 22 నుంచి విశాఖ కేంద్రంగా ముఖ్యమంత్రి తన కార్యకలాపాలు ప్రారంభించటం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే స్వయంగా ముఖ్యమంత్రి ఢిల్లీ కేంద్రంగా జరిగిన పార్టనర్ షిప్ సమ్మిట్ సన్నాహక సదస్సులో విశాఖే ఏపీ రాజధాని అని.. తాను త్వరలో విశాఖకు మారుతున్నానని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆ దిశగా అడుగులు పడుతున్నాయి.రాజకీయంగానూ విశాఖ కేంద్రంగా విశాఖ కేంద్రంగానే ఇప్పుడు ఏపీ రాజకీయాలు నడుస్తున్నాయి. మూడు రాజధానుల పైన సుప్రీంకోర్టులో అనుకూల తీర్పు వస్తే..మార్చి 6 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనే బిల్లును ప్రవేశ పెట్టి.. మార్చి 22న ముందుగా సీఎం కార్యాలయం..ఆ తరువాత క్రమేణా ప్రభుత్వ కార్యాలయాల తరలింపు దిశగా ఆలోచన సాగుతోంది. ప్రతిపక్షాలు మాత్రం అమరావతి రాజధానిగా కొనసాగుతుందని ధీమాగా చెబుతున్నారు. సీఎం విశాఖలో క్యాంపు కార్యాలయం ద్వారా పాలన ప్రారంభించినా.. కోర్టు తీర్పు తరువాతనే అధికారికంగా రాజధాని మార్పు పైన నిర్ణయం ఉంటుందని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో.. ఈ నెల 23న సుప్రీంలో జరిగే మూడు రాజధానుల కేసు విచారణ కీలకం కానుంది.
Admin
Viswas Tv