విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / అనకాపల్లి జిల్లా : మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక స్వావలంబన కోసం ఇచ్చే స్త్రీనిధి రుణాల్లో భారీ అవకతవకల ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఒకే పంచాయతీ పరిధిలోని 22 గ్రూపులకు సంబంధించిన లావాదేవీలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోట్ల రూపాయల రుణాల్లో భారీ మొత్తం బకాయిలుగా ఉండటం... అసలు తమకు తెలియకుండానే రుణాలు తీసుకున్నట్లు నమోదయ్యాయంటూ కొందరు మహిళలు ఆరోపించడం ఇప్పుడు సంచలనంగా మారింది. మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన స్వయం సహాయక సంఘాలు... వారి అవసరాలకు అండగా నిలవాల్సిన స్త్రీనిధి రుణాలు... ఇప్పుడు దేవరాపల్లిలో వివాదానికి కేంద్ర బిందువుగా మారాయి. స్త్రీనిధి రుణాల పేరుతో భారీగా నిధులు దారి మళ్లించారంటూ మహిళా సంఘాల సభ్యులు ఆందోళనకు దిగారు. దేవరాపల్లి గ్రామానికి చెందిన వినాయక ఎస్హెచ్జీ, గౌరీ పార్వతి ఎస్హెచ్జీతో పాటు పలు మహిళా సంఘాల సభ్యులు వెలుగు కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. స్త్రీనిధి రుణాల విషయంలో పూర్తి స్థాయి విచారణ జరిపి... అసలు నిజాలు బయటకు తీయాలని వారు డిమాండ్ చేశారు. దేవరాపల్లి పరిధిలోని స్త్రీనిధి సంఘాలకు మొత్తం...రూ.1 కోటి 10 లక్షల 35 వేల రూపాయలు రుణాలుగా అందించినట్లు తెలుస్తోంది. అయితే ఇందులో...రూ.64 లక్షల 57 వేల 262 రూపాయలు ఇంకా బకాయిలుగా ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఇంత భారీ మొత్తంలో బకాయిలు ఉండటంతో...అసలు ఈ రుణాలు ఎవరికి వెళ్లాయి...? ఎంత మొత్తం ఏ గ్రూపు సభ్యుల ఖాతాల్లోకి చేరింది...?అనే ప్రశ్నలు ఇప్పుడు తెరపైకి వచ్చాయి. రికవరీ కోసం అధికారులు నేరుగా సంఘ సభ్యులను సంప్రదించడంతో అసలు విషయం బయటకు వస్తోందని మహిళలు చెబుతున్నారు.తాము తీసుకున్నది లక్ష లేదా రెండు లక్షల రూపాయలు మాత్రమేనని...ఆ మొత్తాన్ని కూడా చెల్లించే దశలో ఉన్నామని కొందరు సభ్యులు చెబుతున్నారు. కానీ తమ పేర్లపై మరింత భారీ మొత్తాలు బకాయిలుగా చూపిస్తుండటంపై వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మేము తీసుకున్నది రెండు లక్షలు అయితే... మూడు, ఐదు లక్షల బకాయిలు ఎక్కడి నుంచి వచ్చాయి...?అంటూ మహిళలు అధికారులను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. మిగిలిన రుణ సొమ్ము ఎవరికి వెళ్లిందో తమకు తెలియదని పలువురు సంఘ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై స్త్రీనిధి అధికారులు ఆరా తీస్తున్నారు. వెలుగు సీసీ గౌరేష్ను కూడా రికవరీ, రుణాల వివరాలపై అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. దీంతో గత వారం రోజులుగా స్త్రీనిధి అధికారులు నేరుగా సంఘ సభ్యులను కలిసి... రుణాల వివరాలు...చెల్లింపులు...బకాయిలపై విచారణ చేపడుతున్నారు.అయితే విచారణలో మహిళలు చెబుతున్న వివరాలు... అధికారిక రికార్డుల్లో ఉన్న లెక్కలకు భిన్నంగా ఉండటంతో ఈ వ్యవహారం మరింత అనుమానాలకు తావిస్తోంది. దేవరాపల్లి పంచాయతీలోని నెంబర్-5 వివోఏ, యానిమేటర్ పరిధిలో...22 గ్రూపుల్లో అవకతవకలు జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించామని స్త్రీనిధి మేనేజర్లు ఎస్. రజిని, కె. జగదీశ్వరి, ఎం. శ్రీధర్ స్పందించారు. అయితే ఏ గ్రూపుకు ఎంత మొత్తం వెళ్లింది...ఎవరి ఖాతాలో ఎంత నగదు జమ అయింది...ఎంత మేరకు రుణాలు డ్రా అయ్యాయి...అనే అంశాలపై బ్యాంకుల నుంచి పూర్తి స్థాయి స్టేట్మెంట్లు సేకరిస్తున్నామని వెల్లడించారు.బ్యాంకు లావాదేవీల వివరాలు అందిన తర్వాత... ప్రతి గ్రూపు ఖాతాను పరిశీలించి...నిధులు ఎక్కడికి వెళ్లాయి...?ఎవరి పేరుతో రుణాలు తీసుకున్నారు...? అసలు సంఘ సభ్యులకు సమాచారం ఉందా లేదా...?అనే అంశాలపై సమగ్ర విచారణ జరుపుతామని అధికారులు చెబుతున్నారు. విచారణ పూర్తయిన అనంతరం పూర్తి నివేదికను బహిర్గతం చేస్తామని స్పష్టం చేశారు.
అయితే ఈ వ్యవహారంలో మరింత లోతైన విచారణ జరగాలని మహిళా సంఘాల సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.స్వయం సహాయక సంఘాల మహిళల పేర్లతో...నకిలీ పత్రాలు సృష్టించి...వారి అనుమతి లేకుండానే లక్షల రూపాయల రుణాలు డ్రా చేసి ఉండవచ్చని కొందరు మహిళలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.అయితే ఈ ఆరోపణలపై అధికారిక దర్యాప్తు పూర్తయితేనే అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఒకే పంచాయతీలోని 22 గ్రూపులపై అవకతవకల అనుమానాలు... రూ.కోటి పదిలక్షలకు పైగా రుణాల లావాదేవీలు... అందులో రూ.64 లక్షలకు పైగా బకాయిలు... మహిళలకు తెలియకుండానే రుణాలు తీసుకున్నారన్న ఆరోపణలు... ఇవన్నీ ఇప్పుడు దేవరాపల్లిలో స్త్రీనిధి వ్యవహారాన్ని హాట్ టాపిక్గా మార్చాయి. ఈ విచారణలో అసలు నిధులు ఎవరి చేతుల్లోకి వెళ్లాయి...? రికార్డుల్లో ఉన్న లెక్కలకు... మహిళలు చెబుతున్న వివరాలకు ఎందుకు తేడా వచ్చింది...? ఎవరి నిర్లక్ష్యం...? ఎవరి పాత్ర...? అనే ప్రశ్నలకు సమగ్ర దర్యాప్తు తర్వాతే సమాధానం దొరకనుంది.
Admin
Viswas Tv